ముంబయిలో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ అమలు

మహారాష్ట్రలో 17కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు

ముంబయి : మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒకే రోజు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య 17కి పెరిగింది. ఇదే సమయంలో మన దేశంలో కేసులు 32కి పెరిగాయి. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ అమలుచేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడటంపై నిషేధం విధించారు. ముంబయి కమిషనరేట్ పరిధిలో ఈ నిషేధం అమల్లో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, వాహన ర్యాలీలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. దీంతోపాటు నాందేడ్, మాలేగావ్, అమరావతి ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణమని చెప్పారు. ఈరోజు, రేపు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. మరోవైపు టాంజానియా, నైరోబీ, యూకే నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/