ఇరాన్ చమురు నౌకలను సీజ్ చేసిన అమెరికా!

ఇరాన్ పై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన అమెరికా

America seizes Iranian oil tankers

అమెరికా: ఇరాన్ నుంచి చమురు నింపుకుని వెళుతున్న భారీ నౌకలను అమెరికా ప్రభుత్వం సీజ్ చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పై ఆంక్షలను విధించిన తరువాత, నౌకలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు పేర్కొన్నట్టు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ నుంచి ఈ ట్యాంకర్ షిప్ లు గ్యాసోలిన్ ఇంధనంతో వెనిజులా వెళుతున్నాయి.

ఈ రెండు దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచే ఉద్దేశంలో భాగంగానే వీటిని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ పై ఆంక్షలను విధించిన తరువాత యూఎస్ ప్రాసిక్యూటర్లు నౌకలను సీజ్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఇప్పటికే అమెరికా సర్కారు, ఇరాన్ పై అణు పరీక్షలు, సీమాంతర క్షిపణుల పరీక్షలను నిర్వహించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమాలు శాంతి కోసమేనని వెల్లడించింది. కాగా, లూనా, పండి, బీరింగ్, బెల్లా అనే పేర్లున్న నౌకలను సైన్యం సహాయంతో సముద్రంలో సీజ్ చేసిన అమెరికా, వాటిని హ్యూస్టన్ తీరానికి తరలించింది. అమెరికా ఉన్నతాధికారులు త్వరలోనే వీటిని సందర్శిస్తారని తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/