అమెరికా చార్జీలు అమాంతం పెంపు

అమెరికా వెళ్లే విద్యార్థులపై భారం
రూ. 60 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు పెరిగిన ఎకానమీ క్లాస్ టికెట్ ధర
వచ్చే నెల నుంచి అమెరికాలో తెరుచుకోనున్న యూనివర్సిటీలు

న్యూఢిల్లీ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు విమానయాన సంస్థలు షాకిచ్చాయి. విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. కరోనా నేపథ్యంలో విమానాలు పరిమితంగా నడవడం, అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే ఇందుకు కారణం. మన దేశంతోపాటు అమెరికాలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు వీసా జారీ ప్రక్రియను మొదలుపెట్టాయి.

వచ్చే నెల నుంచి అమెరికాలోని యూనివర్సిటీలు తెరుచుకోనున్న నేపథ్యంలో తొలుత విద్యార్థి వీసాలను మాత్రమే జారీ చేస్తున్నాయి. ఈసారి చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు వీసాలు లభించినట్టు తెలుస్తోంది. వీరందరూ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అంతర్జాయ విమాన సర్వీసులు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. దీంతో అమెరికాకు పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా సేవలు లేకపోవడంతో ఆయా సంస్థలు విమాన చార్జీలను అమాంతం పెంచేశాయి. మామూలుగా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ. 60 వేలు కాగా, ఇప్పుడది ఏకంగా రూ. 90 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు ఉంది. అయితే, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఇది రూ. 90 వేలుగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/