జాలర్ల వలకు చిక్కిన రూ.50 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్

అప్పుడప్పుడు సముద్ర చేపల వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు మాత్రమే కాదు అంతకు మించినవి కూడా దొరుకుంటాయి. తాజాగా తమిళనాడు జాలర్లకు ఏకంగా రూ.50 కోట్ల విలువ చేసే అంబర్‌గ్రిస్ దొరికింది. అంబర్‌గ్రిస్ అనేది తిమింగలం వాంతి. దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడపులో తయారయ్యే దీనిని అవి వాంతి రూపంలో బయటకు పంపుతాయి. దీనిని ‘ఫ్లోటింగ్ గోల్డ్‌’గానూ వ్యవహరిస్తారు.

తాజాగా ఇది కల్పాక్కం సమీపంలోని జాలర్ల వలకు చిక్కింది. దీని విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలోని కడప్కాకం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ కలిసి చేపల వేటకు శనివారం సముద్రంలోకి వెళ్లారు. వారి వలకు 38.6 కిలోల అంబర్‌‌గ్రిస్ పడింది. దీంతో వారు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీ అధికారులకు తెలియజేశారు. వారొచ్చి దీనిని స్వాధీనం చేసుకున్నారు.