గుండ్లకమ్మ గేటు ఈ పరిస్థితికి రావడానికి కారణం గత టిడిపి ప్రభుత్వమే – అంబటి

ambati rambabu
ambati rambabu

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు.. మొన్న రాత్రి ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదతో మూడో గేటు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ప్రాజెక్టును సందర్శించిన మంత్రి గత టిడిపి ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాజెక్టు గేట్లు లోపలికి కూరుకుపోవడం వల్ల వాటర్ లీక్ అవుతున్నట్లు గుర్తించామన్నారు. రెండు గేట్లు లాక్ అవ్వడంతో.. ప్రత్యామ్నాయంగా రెండు గేట్లు అమర్చామని అన్నారు. త్వరగా గేట్లను బాగు చేసి.. నాగార్జునసాగర్ నీటితో రిజర్వాయర్ ను నింపుతామని తెలిపారు. ఈ విషయంలో కొందరు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరగడానికి గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు.

గేట్లు ఐదారేళ్లుగా తుప్పుపట్టి ఉండడంతో గేటు దెబ్బతిందని దీంతో నీళ్లు బయటకు పోయాయని మంత్రి తెలిపారు. రెండు టీఎంసీలు సముద్రంలోకి వదలక తప్పదని వెల్లడించారు. గేట్ల మరమ్మతులను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు. ఖరీఫ్‌కు సాగర్‌ నుంచి నీరు మళ్లించి గుండ్లకమ్మ నింపుతామని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెంద వలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో అశ్రద్ధ చేయడం వల్లే తరుచూ ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు లోనవుతున్నాయని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సుధాకర బాబు, జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో స్పిల్ వే రెగ్యులేటర్ గేట్లను పరిశీలించారు.