బాలయ్య అభిమానుల వల్ల ఏఎంబీ సినిమాస్ కు డ్యామేజ్
నందమూరి బాలకృష్ణ కు కోట్లలో అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. ఆయనను చూడాలని , ఒక్కసారైనా కలవాలని తహతలాడుతుంటారు. అందుకే ఆయన ఏదైనా సినిమా ఫంక్షన్ కు వస్తున్నారంటే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. తాజాగా వీరి అభిమానం ఏఎంబీ సినిమాస్ కు డ్యామేజ్ తెచ్చిపెట్టింది.
విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ శుక్రవారం ఏఎంబీ సినిమాస్ లో విడుదల చేసారు. ఏఎంబీ సినిమాస్ కు బాలకృష్ణ వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. థియేటర్లోకి ముందుగా వెళ్లాలనే తొందరలో ఏఎంబీ సినిమాస్ షటర్ను బాలయ్య ఫ్యాన్స్ డ్యామేజ్ చేసారు.
సెక్యూరిటీ సిబ్బంది షటర్ను ఎత్తుతుండగా బాలయ్య అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారట. ఒకరిపై ఒకరు పడుతూ, తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారట. ఈ క్రమంలో షటర్ దెబ్బతిన్నదని అంటున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, హీరోల అభిమానులు థియేటర్ల వద్ద తలుపు, కిటికీలు, గ్లాస్ డోర్స్ వంటికి ధ్వంసం చేయడం కొత్తేమీ కాదని అంత మాట్లాడుకుంటున్నారు.