అమరావతిలో సకల జనుల సమ్మె
17వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

అమరావతి: ఏపిలో మూడు రాజధానుల అంశంపై రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు నుండి గ్రామాల్లో సకల జనుల సమ్మెకు జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీస్టాల్స్, హోటల్స్ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆస్పత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. మరోవైపు రాజధానిపై ఈరోజు బోస్టర్ కన్సల్టింగ్ కంపెనీ నివేదిక ఇవ్వనుంది. దీనిపై రైతులు మాట్లాడుతూ బోస్టన్ కన్సల్టింగ్ కంపెనీ అనేది బోగస్ కంపెనీ అని వాళ్ల నివేదిక జగన్ చెప్పిన విధంగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యమన్నారు. ప్రజల మద్దతు లేదంటున్న నేతలకు బుద్ధి ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపు అంటే తమ శావాల మీదుగా తీసుకెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. విశాఖ వాసులు జగన్ను రాజధాని కావాలని అడిగారా అని ప్రశ్నించారు. జగన్ను నమ్మి గెలిపిస్తే తమను నడి వీధిలో నిలబెట్టారని ఆక్రోశం వెల్లగక్కారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/