అలిపిరి వద్ద ముగిసిన అమరావతి రైతుల మహా పాదయాత్ర

నడకమార్గం వద్ద కొబ్బరికాయలు కొట్టి యాత్రను ముగించిన రైతులు

తిరుపతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగిసింది. కాసేపటి క్రితం వీరంతా తిరుపతిలోని అలిపిరికి చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ స్థలం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. స్వామివారి నామోచ్చరణ చేస్తూ తమ పాదయాత్రను ముగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి ఆశీస్సులతో తమ పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిందని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా రైతులు, వివిధ సంఘాలు, పార్టీలు తమకు మద్దతుగా నిలిచాయని… అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకుని అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరారు.

నవంబర్ 1న అమరావతి రైతుల మహా పాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమైంది. 44వ రోజున వీరి యాత్ర ముగిసింది. రేపు వీరంతా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 500 మంది రైతులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు టీటీడీ అనుమతించింది. ఇంకోవైపు ఈనెల 17న తిరుపతిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/