యూపీ ఎన్నికలను వాయిదా వేయాలి : అలహాబాద్ హైకోర్టు
కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని కోరిన హైకోర్టు
ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని వ్యాఖ్య
ప్రయాగరాజ్ : ప్రపంచాన్ని కలవర పెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్నూ వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా తెలిపింది. మరోవైపు, దేశంలో అత్యంత ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉండే ఉత్తరప్రదేశ్లో కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో గెలుస్తే కేంద్రంలోనూ తిరుగే ఉండబోదని అన్ని పార్టీలు భావిస్తాయి. దీంతో ఎన్నికల హడావుడి ఇప్పటికే ప్రారంభమైంది. భారీగా జనసమీకరణాలతో సభలు నిర్వహించే అవకాశం ఉండడం, ఇదే సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి ప్రారంభం కావడంతో ఆందోళన నెలకొంది. యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు అసెంబ్లీ ఎన్నికలపై స్పందిస్తూ… కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.ఎన్నికల ప్రచార ర్యాలీలపై నిషేధం విధించాలని చెప్పింది. శరవేగంగా విజృంభిస్తోన్న ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చైనా, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాయని గుర్తు చేసింది. భారత్లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయని చెప్పింది. కరోనా రెండో దశ విజృంభణ సమయంలో లక్షలాది మంది మృతి చెందారని తెలిపింది.
యూపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేసులు, మరణాలు పెరిగాయని గుర్తు చేసింది. వాటి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. లక్షలాది మంది పాల్గొంటున్న ఎన్నికల ర్యాలీల్లో కరోనా నిబంధనలు పాటించడం అసాధ్యమేనని తెలిపింది. రాజకీయ పార్టీలు టీవీ, వార్తా పత్రికల ద్వారా ప్రచారం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీకి సూచించింది. ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని పేర్కొంది. మనుషులు ప్రాణాలతో ఉంటేనే ప్రచారాలైనా, ఎన్నికలైనా కొనసాగుతాయని హైకోర్టు అనడం గమనార్హం.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/