ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో మెరిసిన సింధు
బర్మింగ్ హామ్: బారత స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధు 21-14,21-17 తేడాతో బివాన్ జెంగ్(అమెరికా) ను వరుస గేమ్లలో ఓడించింది. 42 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ కాసేపు హోరాహోరీగా సాగింది. 8-9 తో వెనుకబడిన సింధు ఒక్కసారిగా పుంజుకుంది. వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆధిపత్యం కనబరిచింది. అదే ఆధిపత్యంతో గేమ్ను సొంతం చేసుకుంది. అయితే ఒక దశలో బివాన్ జెంగ్ దూకుడుగా ఆడడంతో 16-16 తో సమమయ్యాయి. ఈ సమయంలో వరుస పాయింట్లతో దుమ్ములేపిన తెలుగుతేజం విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత బ్యాడ్మింటన్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొన్నాళ్లుగా పేలవ ఫాంతో తంటాలుపడుతున్న భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్కు నిరాశే ఎదురైంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోక్యో ఒలింపిక్స్లో బెర్త్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/