అర్హులైన వాళ్లందరికీ ఆసరా పథకం కింద పెన్షన్లు
అభయహస్తాం పథకాన్ని సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: అభయహస్తం పథకాన్ని రాష్ట్ర పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. ఈపథకం కింద అందుతున్న పెన్షన్ల తీరు, తెన్నులను ఆయన పరిశీలించారు. గురువారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అభయ హస్తం పథకంలో పెన్షన్లు రాని అర్హులైన వాళ్లందరికీ ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాటాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్ల పధకాన్ని అమలులోకి తీసుకు వచ్చారని, పెన్షన్ల మొత్తాన్ని కూడా 2,016 రూపాయలకు పెంచారని గుర్తుచేశారు. అలాగే కేవలం వృద్దులకే కాకుండా బీడీ కార్మికులకు, బోదకాలు బాధితులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు అందేలా పెద్దమనసుతో ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పెన్షన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే అభయ హస్తం పథకంపెన్షన్ల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలని అధికారులను ఆదేశించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/