కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇక విధులకు హాజరుకావాల్సిందే
సిబ్బంది మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇక నుంచి ఆఫీసులకు రావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వాళ్లకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా ప్రాంతాలు డీ నోటిఫైడ్ అయ్యేంత వరకూ అక్కడి వారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు అధికారుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు అందుబాటులో ఉండాలని సూచించింది. సమావేశాలకు సైతం వీరు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటివరకూ కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయి, ఆ దిగువ స్థాయి అధికారులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.
ఇక ఆఫీసుల్లో రద్దీ అధికం కాకుండా ఉద్యోగులకు వివిధ రకాల టైమ్ స్లాట్ లను నిర్ధారించుకోవాలని, వాటి ప్రకారం, అందరు అధికారులూ వీక్ డేస్ లో ఆఫీసులకు రావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ కేటగిరీ వారికి కూడా మినహాయింపులు ఉండబోవని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ బయో మెట్రిక్ అటెండెన్స్ ను మాత్రం తప్పనిసరి చేయబోవడం లేదని వెల్లడించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/