పెద్దల విషయంలో అప్రమత్తం

ఆరోగ్య పరిరక్షణకు శ్రద్ధ అవసరం

Alert in case of adults
Alert in case of adults

ఇంట్లో పెద్దవారు ఉంటే వారిని చంటిపిల్లల్లా చూసుకుంటాం. కరోనా ప్రబలిన సమయంలో వారిని కంటికి రెప్పల్లా కాపాడుకోవాలి.

కరోనా ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకే ప్రమాదం కూడా వీరికే ఎక్కువ కాబట్టి.. పెద్దల పట్ల తీసుకునే జాగ్రత్తల్లో ప్రత్యేక మెలకువలు పాటించాలి.

ఇన్‌ఫెక్షన్‌ సోకే వీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. పెద్దల్లో చలాకీగా, హుషారుగా ఉండేవారు ఉంటారు.

ఇంటికే పరిమితమై విశ్రాంతిగా గడిపేవారు ఉంటారు. గదికే పరిమితమై మంచం మీద నుంచి కదలలేని వారూ ఉంటారు.

వీరికి మధుమేహం, అధిక రక్తపోటు ఇతరత్రా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు వీరికి సమయానికి ఆహారం, మందులు అందిస్తూ అవసరాలు తీరిస్తే సరిపోయేది.

కానీ కరోనా కాలంలో వీరికి అదనపు సేవలు అందించక తప్పదు. అరవై దాటిన పెద్దలకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ తేలికగా సోకే ప్రమాదం ఉంది.

కాబట్టి వారి బాగోగుల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబరచాలి. వీరికి ఎంతో కొంత ఓపిక ఉంటుంది

. ఇల్లంతా తిరుగుతూ, తమ పనులు తాము చేసుకోగలుగుతారు. ఈ వయసు వారికి అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు సహజం. వాటికి అసవరమైన మందులు తీసుకుంటే ఉంటారు. అయినా కుటుంబసభ్యులు కొన్ని అదనపు జాగ్రత్తలు పాటించాలి.

ఈ పెద్దల వ్యాధినిరోధక శక్తి పెంచడం కోసం మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గుడ్డు తెల్లసొన, చికెన్‌, చేపలు మొదలైన వైట్‌మీట్‌ ఎక్కువగా ఇవ్వాలి. మటన్‌ తగ్గించాలి.

శాకాహారులైతే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పులు రోజూ ఇవ్వాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు,
పళ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

మధుమేహం, అధిక రక్తపోటులకు మందులు వాడుతూనే ఉన్నా, తరచుగా వైద్య పరీక్షలు చేయిస్తూ, వాటిలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు రాకుండా చూసుకోవాలి.

నడక అలవాటు ఉంటే ఇంట్లో లేదా డాబా పైన రోజుకు కనీసం అరగంట పాటు నడిచేలా ప్రోత్సహించాలి. పెద్దల గదిని శుభ్రంగా ఉంచాలి.

పెద్దలు గది దాటి బయటకు వచ్చిన ప్రతిసారి మూడు పొరల మాస్క్‌ తప్పక వాడేలా అలవాటు చేయాలి.

రోజు మొత్తంలో రెండు లీటర్ల మంచినీళ్లు తాగేలా చూడాలి. పద్దెల ఆసక్తి మేరకు వారి చేత యోగా, ప్రాణాయామం చేయించాలి.

ఇక డెబ్భయి యేళ్ల వయసు వారు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎక్కువ సమయం పాటు మంచినికే పరిమితమైతే శరీరంలో స్రావాలు పేరుకుపోతాయి. ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గుతుంది.

ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉంటాయి. బలంతంగా అయినా సరే వారికి వ్యాయామం అందేలా స్వల్ప సమయాలు పాటు నడిపించాలి.

వారికి ఉన్న ఓపికను బట్టి ప్రాణాయామం కూడా చేయించాయి. తేలికగా ఉండే మెత్తని పదార్థాలు తినేందుకు ఇవ్వాలి. పళ్లరసాలు, నీళ్లు ఎక్కువగా తాగేలా చూడాలి.

గదిని పరిశుభ్రంగా ఉంచాలి. గదిలోకి కుటుంబ సభ్యుల ప్రవేశాన్ని పరిమితం చేయాలి.

పెద్దలు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తప్ప, మిగతా సమయాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించేలా చూడాలి. పెద్దల గదిలోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం తప్పక పాటించాలి.

ఎనభై యేళ్ల వయసు వారికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు నూటికి నూరు శాతం అడ్డుకోవాలి.

కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా నడుచుకోవాలి. వీరికి జీర్ణశక్తి తక్కువ కాబట్టి తేలికగా అరిగే పదార్థాలు ఇవ్వాలి.

మంచానికే పరిమితమైన వారి ఊపిరితిత్తులోకి ఎక్కువ గాలి చొరబడేలా చేయడం కోసం రోజులో అప్పు డప్పుడూ అర గంటపాటు బోర్లా పడుకోబెడుతూ ఉండాలి.

ఉడకబెట్టి, ముద్దగా చేసిన పళ్లగుజ్జు పెరుగుతో కలిపి తినిపించాలి. జావలు తాగించవచ్చు. చల్లని పదార్థాలకు బదులుగా వేడివి తినిపించాలి.

మెత్తగా ఉడికించిన కూరగాయలు తినిపించాలి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగేలా వారి చేత స్పైరో మీటరు సాధనచేయించాలి.

మాంసకృత్తుల లోపం ఏర్పడకుండా పౌడర్ల రూపంలో ఉండే ప్రొటీన్‌ సప్లిమెంట్‌లు ఇవ్వాలి. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తితో కుటుంబసభ్యులు మెలిగే విధంగానే ఈ కోవకు చెందిన పెద్దలతోనూ మసలుకోవాలి.

పెద్దలు ఆరోగ్యంగా ఉన్నా, అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ అదుపులోనే ఉన్నా కుటుంబసభ్యులు వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుటుంబసభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట సంచరించడం తగ్గించాలి. ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతిసారి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.

పెద్దల గది బయటే శానిటైజర్‌ ఏర్పాటు చేసుకుని, దాంతో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే వారి గదిలోకి వెళ్లాలి. రెండు పొరలున్న మాస్క్‌ ధరించాలి.

పనివాళ్లను ఇంట్లో అడుగుపెట్టనీయకూడదు. పెద్దలు బయటకు వెళ్లే వీలు లేకుండా, వారికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చి పెట్టాలి.

కుటుంబసభ్యులందరూ తప్పక మాస్క్‌లు ధరిస్తూ, పెద్దల నుంచి కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి.

సాధారణ కరోనా లక్షణాలైన దగ్గు, జ్వరంలాంటి లక్షణాలతో పాటు ఆ లక్షణాలకు బదులుగా ఇతర లక్షణాల ద్వారా కరోనా ఇన్ఫెక్షన్‌ బయటపడు తుంటాయి.

కలి తగ్గిపోవడం, నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పులు, విరేచనాలు వాంతులు, రుచి కోల్పోవడం, వాసన కోల్పోవడం, మత్తుగా ఉంటూ, ఎక్కువ సమయం పాటు నిద్ర పోతు ఉండటం వంటివి ఉంటాయి.

పెద్దలకు పిల్లలకు మధ్య అనుబంధం ఎక్కువ. లాక్‌డౌన్‌ మూలంగా బడులు మూతబడి పిల్లలు ఇంటికే పరిమితం అయిన ప్రస్తుత సమయంలో పెద్దల నుంచి పిల్లలను దూరం పెట్టడం కొంత కష్టమే. అయినా పెద్దలను కాపాడుకోవాలంటే పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఈ విషయం పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి. శానిటైజర్‌ వాడకం అలవాటు చేయాలి. పెద్దలతో సామాజిక దూరం పాటించేలా చూడాలి.

వార్తల ద్వారా తమకు కరోనా తేలికగా సోకే వీలుందనే విషయాన్ని పెద్దలు గ్రహిస్తారు.

ఇది ఒక విధంగా మంచిదే అయినా, తమకు ఆ వ్యాధి ప్రాణాంతకం అనే భయం వారిలో ఉంటుంది. దాంతో పెద్దలు భయాందోళనలకు లోనవుతారు. మానసికంగా కుంగిపోతారు.

ఇంటికే పరిమితం కావలసిరావడం, ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల వారిలో అసహనం, చికాకు లాంటి లక్షణాలు తలెత్తుతాయి.

అయితే ఈ సమయంలో పెద్దల ప్రవర్తనకు మిగతా కుటుంబసభ్యులు విసుక్కోకుండా ఓపికగా వ్యవహరించాలి.

వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. అండగా నిలవాలి. పద్దెలకు ఒంటరి భావన కలగకుండా వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి.

వారితో పాటే వారి గదిలో గడిపేటప్పుటు కూడా సామాజిక దూరం పాటించాలి. మాస్క్‌ ధరించాలి.

పద్దెల గదిలో కాలక్షేపం కోసం టివి, పుస్తకాలు ఏర్పాటు చేయాలి. వార్తా చానల్లు కాకుండా, ఇతరత్రా సినిమా చానల్లు చూసేలా వారిని ప్రోత్సహించాలి.

చెస్‌ లూడో లాంటి ఆటలు వారితో ఆడించాలి. సాధ్యమైనంతవరకు కబర్లుతో, సరదా సంగతులతో కాలక్షేపం కలిగిస్తూ వారిని ఉల్లాసంగా ఉండేలా చూడాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/