రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను : అఖిలేశ్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు స్పష్టమైంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ మధ్య పొత్తు ఉంటుందన్నారు. ఆర్ఎల్డీతో పొత్తు ఫైనల్ అయ్యిందని, కేవలం సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ ఇంటర్వ్యూలో అఖిలేశ్ వెల్లడించారు. ఆజమ్ఘర్ నుంచి ఎంపీగా ఉన్న అఖిలేశ్ యాదవ్ .. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. శివపాల్ యాదవ్కు చెందిన ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీకి కూడా అవకాశం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
ఆదివారం జరిగిన ఓ సభలో అఖిలేశ్ రాజకీయ వివాదానికి తెరలేపారు. హర్దోయిలో జరిగిన ఆ సభలో ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ అలీ జిన్నాను విరోచిత నేతగా చిత్రీకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, జిన్నాలు ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారని, అందరూ ఒకే ఇన్స్టిట్యూట్లో చదివారని, వాళ్లంతా బారిస్టర్లు అయ్యారని, ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని అఖిలేశ్ అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/