పోలీసుల నిర్బంధంలో అఖిలేష్ యాదవ్‌

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ను నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన బాధిత రైతు కుటుంబాలకు పరామర్శించేందుకు ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అఖిలేష్‌ తన ఇంటి బయట బైఠాయించి నిరసన తెలిపారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు బ్రిటీషర్లు కూడా పాల్పడలేదని విమర్శించారు. రాజకీయ నేతలను సంఘటనా స్థలానికి వెళ్లనీయడం లేదని, ప్రభుత్వం ఏమి దాస్తున్నది అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో బాధిత రైతు కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.

మరోవైపు అఖిలేష్‌ యాదవ్‌ నివాసానికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నివాస మార్గాన్ని మూసివేసిన పోలీసులు చివరకు అఖిలేష్‌ యాదవ్‌తోపాటు ఆ పార్టీ నేతలను నిర్బంధించారు. పోలీస్‌ వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/