హైదరాబాద్‌కు చేరిన ఐశ్వర్య మృతదేహం

మూడు రోజుల క్రితం టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా జడ్జి కుమార్తె ఐశ్వర్య (27) మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. దుండగుడు జరిపిన కాల్పులలో ఐశ్వర్య తో పాటు మరో ఎనిమిది మంది మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య అమెరికాలో గత కొంతకాలంగా ఫర్‌ఫెక్ట్ జనరల్‌ కంట్రాక్ట్స్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఉత్తర డల్లాస్‌లోని ఓ ఔట్‌లెట్ మాల్‌‌కి వాహనంలో వచ్చిన ఆ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో.. 9 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. బాధితుల్లో కొంతమంది యువకులు, ఐదేళ్ల వయసు పిల్లలు కూడా ఉన్నారు. కాల్పుల తర్వాత పోలీసులు ఆ దుండగుణ్ని కాల్చిచంపారు. ఉత్తర డల్లాస్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని స్ప్రాలింగ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత షాపింగ్ మాల్‌లోని కస్టమర్లు, ఉద్యోగులూ… పార్కింగ్ లాట్స్‌లోకి పరుగులు తీశారు. టాక్టికల్ గేర్ ధరించిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. అతను ఎందుకు కాల్పులు జరిపాడో తెలియలేదు.