శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దు ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం వెళ్లాల్సిన, ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ విమానాలు రద్దు అయ్యాయి. అయితే దీనిపై ప్రయాణీకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం తో..వారంతా ఉదయాన్నే ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. తీరా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తర్వాత విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. దీంతో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు ప్రయాణీకులు.

రద్దైన విమానాల వివరాలు హైదరాబాద్ – తిరుపతి, హైదరాబాద్ – బెంగుళూరు, హైదరాబాద్ – వైజాగ్, హైదరాబాద్ – మైసూర్, హైదరాబాద్ – చెన్నై, తిరుపతి – హైదరాబాద్, బెంగుళూరు – హైదరాబాద్, చెన్నై – హైదరాబాద్. ఆపరేషన్ కారణాల వల్ల ఈ ఎనిమిది విమానాలు రద్దయినట్లు ఆధికారులు ప్రకటించారు. ప్రయాణికుల అందోళనతో స్పందించిన అధికారులు టిక్కెట్ల డబ్బులు రిఫండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.