అగ్నిపథ్​ కు వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం..

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్​), అసోం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.

అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్‌ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కారణంగా రెండేళ్లు రిక్రూట్​మెంట్​ జరగలేదని.. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్‌ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. శుక్రవారం ‘అగ్నిపథ్’పై సికింద్రాబాద్ ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. అగ్నిపథ్​ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్​లో చేసిన ఆందోళనలు… తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోపక్క రేపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది .