మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణం
ఆమెపై లేవనెత్తిన పిటీషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీః న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ ఇవాళ మద్రాసు హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జడ్జిగా ఆమె నియామకాన్ని నిలిపివేయాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సుప్రీంలో ఆ పిటీషన్లపై విచారణ జరుగుతున్న సమయంలోనే.. మద్రాసు హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరీ ప్రమాణ స్వీకారం చేశారు. గౌరీ నియామకాన్ని ఆపివేయాలని, ఆమెకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని హైకోర్టుకు చెందిన బార్ అసోసియేషన్ సుప్రీంలో పిటీషన్ వేసింది.
తమిళనాడులోని మధురైకి చెందిన 54 మంది లాయర్లు.. విక్టోరియా గౌరీ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీం కొలీజియంకు లేఖ రాశారు. మద్రాసు హైకోర్టుకు అనుసంధానమైన మధురై బెంచ్ తరపున గౌరీ ప్రాతినిధ్యం వహించారు. గౌరీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రిట్ పిటీషన్ను ప్రోత్సహించడంలేదని ధర్మాసనం తెలిపింది.
కాగా, ఈరోజు ఉదయం 10.35 నిమిషాలకు గౌరీ ప్రమాణ స్వీకారం ఉండగా.. సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను అదే సమయంలో విచారించింది.