ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో పవన్ చెప్పాలి: ఆదిమూలపు సురేశ్

పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అన్న ఆదిమూలపు

AP Minister A Suresh
AP Minister A Suresh

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు బిజెపితో ఉంటూ మరోవైపు టిడిపితో కలిసి పని చేస్తున్నాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో పవన్ చెప్పాలని అన్నారు. నాలుగు ఎమ్మెల్సీలు కైవసం చేసుకోగానే టిడిపి నేతలు ఏదో సాధించేసినట్టు ఫీలవుతున్నారని… వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

175 స్థానాల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులు కూడా లేరని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని… తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రూ. 300 కోట్ల సీమెన్స్ స్కామ్ జరిగిందని చెప్పారు. ఈ స్కాం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.