కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు కరీంనగర్ లో నిరసన సెగ ఎదురైంది. నేడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్నారు. కమలాపూర్‌లో రూ.45 కోట్లతో నిర్మించిన మహత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకులాలు, కేజీబీవీ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాల్ని కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హెలికాఫ్టర్ లో కరీంనగర్ కు చేరుకున్న కేటీఆర్ కు ఏబీవీపీ కార్యకర్తల నుండి నిరసన సెగ ఎదురైంది.

కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను అడ్డుకున్నారు. కేటీఆర్ ప్రారంభోత్సవం చేసే గెస్ట్ హౌస్ వద్ద ఆయన కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు రెండుసార్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ జెండాలతో వచ్చిన ఆందోళనకారులు ఆ తర్వాత కాషాయ జెండాలతో నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేసారు.