29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం.. నెట్‌వర్క్ ఆసుపత్రుల లేఖ

పెండింగ్ బిల్లులు, పలు శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లు పరిష్కరించకపోవడంతో నిర్ణయం

aarogyasri-services-will-be-stopped-from-29-says-network-hospitals-to-ap-govt

అమరావతిః ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్ర చికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. 29 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద రోగులను చేర్చుకోబోమని స్పష్టం చేశాయి. డిసెంబర్ 15 లోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ తమకు హామీ ఇచ్చి అమలు పరచలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాయి.

కాగా, ఆసుపత్రులకు వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. పలు శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గతంలో డెడ్‌లైన్‌ను విధించిన సంగతి తెలిసిందే.