దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా ..కేజ్రీవాల్ ముఖ్యం కాదు.. ఈ దేశమే ముఖ్యం : కేజ్రీవాల్
బీజేపీ లాంటి పెద్ద పార్టీలు గూండాయిజం చేయరాదని చురక
కలిసి కట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళదామని పిలుపు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఢిల్లీలో ఈ-ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తన ఇంటిపై బుధవారం నాడు బీజేవైఎం శ్రేణుల దాడి నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యం కాదు. ఈ దేశమే ముఖ్యం. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అంటూ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీ నేతలకు ఆయన చురకలు అంటించారు.
దేశంలోనే అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న బీజేపీ ఇలా గుండాయిజం చేస్తూ దాడులకు పాల్పడకూడదని చెప్పిన కేజ్రీ.. బీజేపీ అనుసరించే ఈ చర్యలు దేశ యువతకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టే అవుతుందని హితవు పలికారు. కలిసి కట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన.. 75 ఏళ్లుగా కలహాలతోనే దేశాన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంచేశామని దెప్పి పొడిచారు. కాగా, కేజ్రీవాల్ ఇంటిపై జరిగిన దాడిపై ఘాటుగా స్పందించిన ఆప్.. కేజ్రీని హత్య చేసేందుకు బీజేవైఎం యత్నించిందని ఆరోపించిన సంగతి తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/