పర్యావరణ పరిరక్షణలో ఓ చిన్నది

Licypriya

ఆ అమ్మాయి చిన్నామ్మాయే. కానీ ఆలోచనలు మాత్రం పెద్దలకు కూడా లేనివి ఉన్నాయి. భవిష్యత్తు గురించి ఇంతలా ఆలోచించేవారుండరు. ఆమె చేసే డిమాండ్లు ఔరా! అనేలా ఉంటాయి. భారత ప్రభుత్వానికి నేను చేసే డిమాండ్‌లు మూడు. ‘జీరో కార్బన్‌ విడుదలకు వాతావరణ చట్టం తీసుకురావాలి., ‘వాతావరణ మార్పులు పేరుతో పాఠ్యాంశాలు చేర్చాలి. ప్రతి విద్యార్థి ఏటా మొక్కలను నాటేలా ప్రోత్సహిస్తూ, పెంచిన వృక్షాల ఆధారంగా డిగ్రీ ఇవ్వాలి, భూగోళ పరిస్థితిని మెరుగుపరచడమే నా జీవితధ్యేయం అంటున్నది ఓ చిన్నది.

ఆమె పేరు లిసిప్రియ కంజుగం. మణిపూర్‌కు చెందిన ఆమె వయసు ఎనిమిదేళ్లు. కానీ ఆలోచనలు మాత్రం గొప్పవి. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్తనవుతానంటున్నది. ఎందుకంటే త్వరలో మనం నివసించే ఈ భూమి అంతరించనుంది. ఆ తరువాత మనం జీవించడానికి స్థలం కనుక్కోవడం కోసమే. చంద్రుడు, మార్స్‌గ్రహాలకి రాకెట్‌ను పంపి, అక్కడ జీవించడం వీలవుతుందా లేదా అని తెలుసుకుంటానని అంటున్నది. లిసిప్రియ కంజుగం. వాతావరణాన్ని మార్చే చట్టాన్ని తెమ్మంటూ గతేడాది పార్లమెంటు ఎదుట పోరాటం చేసింది.

ఢిల్లీలో ‘ఇండియా గేట్‌ వద్ద ‘గ్రేట అక్టోబరు మార్చ్‌ పేరుతో వేలాదిమంది మద్దతుదారులను కలుపుకొని ఏడు రోజులపాటు మార్చ్‌ చేసింది. విపత్తు నిర్వహణపై మనదేశం తరపున ప్రతినిధిగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రసంగించింది. ఇందులో 140 దేశాలకు చెందిన మూడువేలమంది ప్రతినిధులు హాజరవడం విశేషం.

ప్రస్తుతం ‘ఇంటర్నేషనల్‌ యూత్‌ కమిటీలో చైల్డ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌కు న్యాయవాదిగా ఉంది. ఇప్పటికే ‘వరల్డ్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్‌, ‘ద ఇండియా పీస్‌ ప్రైజ్‌, ‘డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డులను అందుకుంది. విదేశాల్లో నిర్వహించే సదస్సులకు ఓ వైపు క్రౌడ్‌ ఫండ్‌ సహాయం అందినా కూడా, లిసిప్రియకు ఆమె తల్లిదండ్రుల సహకారం పూర్తిగా ఉంది.

దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో లిసిప్రియ పోరాటానికి వారు ఓ వైపు మద్దతునిస్తున్నా మరోవైపు వారిపై పడుతున్న ఆర్థిక భారాన్నీ మోస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లేటప్పుడు అక్కడ ఉండటానికి లిసిప్రియ తల్లి తన బంగారపు గొలుసును విక్రయించి మరీ హాటల్‌ సౌకర్యాన్ని అందించింది. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న లిసిప్రియకు చదువుకునే తీరిక ఉండటం లేదు. స్కూల్‌కు వెళ్లాలి,

తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాలి అని ఉంటుంది. కానీ సమయం లేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూల్‌ మానేసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూస్తే నా మనసు ద్రవించిపోతుంది. దీనికంతా కారణం పర్యావరణ కాలుష్యమే. దీనిని నాయకులు గుర్తించాల్సి అవసరం ఉంది అని చెప్పే లిసిప్రియను పర్యావరణ కార్యకర్తగా ప్రపంచమంతా పేరొందిన గ్రేటా తంబర్గ్‌తో పోల్చడం విశేషం. ఈమెను ‘గ్రేటా ఆఫ్‌ ద గ్లోబల్‌ సౌత్‌గా పిలుస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/