గుంటూరు లో వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య

ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య చేసిన ఘటన గుంటూరు లో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన జ్ఞానేశ్వర్ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తపస్వి తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తక్కెళ్ళపాడు లోని ఓ దంత వైద్య కళాశాలలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు, వీరిద్దరి మధ్య రాజి కుదిరిచ్చేందుకు తన వద్దకు పిలిచింది. దీనితో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్దే ఉంటుంది.

ఈ క్రమంలో తపస్వి ఫై పగ పెంచుకున్న జ్ఞానేశ్వర్ హతమార్చాలని ప్లాన్ వేసాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు ప్రేమికులిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు కోపోద్రిక్తుడై తపస్విపై సర్జికల్ బ్లేడ్ తో గొంతు కోశాడు. పక్కనున్న స్నేహితురాలు కేకలు వేసి బయటకు వెళ్లడంతో స్థానికులు వచ్చారు. దీంతో జ్ఞానేశ్వర్ తలుపులు మూసేసి, కొన ఊపిరితో ఉన్న తపస్విని ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగలగొట్టి ఆమెను 108 వాహనంలో తరలించారు.

తపస్వి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో జీజీహెచ్‌లో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ముంబై నుంచి తపస్వి తల్లిదండ్రులు గుంటూరు రానున్నారు. పెదకాకాని పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానేశ్వర్‌ని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి నుంచి సర్జికల్‌ బ్లేడ్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమను నిరాకరించినందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. తపస్వి స్నేహితురాలు విభా పరారీలో ఉన్నారు. స్నేహితురాలు విభా ఇంట్లోనే హత్య జరిగింది కాబట్టి విభాపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య తర్వాత కనిపించకుండా పోయిన విభా కోసం పోలీసులు గాలిస్తున్నారు. విభా దొరికితే మరిన్ని విషయాలు భయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.