సిరిసిల్ల యువతీ కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలిని కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున హనుమాన్ ఆలయంలో పూజ చేయడానికి శాలిని వెళ్లింది. తోడుగా ఆమె తండ్రి కూడా వెళ్లారు. అప్పటికే అక్కడికి కారులో వచ్చిన కొంతమంది యువకులు గుడిలో నుంచి బయటకొచ్చిన శాలిని ని బలవంతంగా కార్ లోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. వెంటనే ఆ తండ్రి పోలీసులకు పిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా..సదరు యువతీ భారీ షాక్ ఇచ్చింది.

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సదరు యువతి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. వీడియోలో కీలక విషయాలను వెల్లడించింది. తాను, జానీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని… తన కోరిక మేరకే జానీ తనను తీసుకెళ్లాడని ఆమె తెలిపింది. జానీని తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన తల్లిదండ్రులు తనకు పెళ్లిచూపులు చూస్తున్నారని, అందుకు జానీకి ఫోన్ చేసి తనను తీసుకెళ్లిపోవాలని చెప్పానని తెలిపింది. తనను తీసుకెళ్లే సమయంలో జానీ మాస్క్ ధరించాడని, అందుకే అతన్ని గుర్తుపట్టలేదని చెప్పింది. వచ్చింది జానీ అని తెలిసిన తర్వాత టెన్షన్ పోయిందని తెలిపింది. తమకు తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని… పోలీసులు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా కోరుతున్నానని తెలిపింది.