జంట పేలుళ్లు..9 మంది మృతి
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్ సులు ప్రావిన్స్లో సోమవారం జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంతో కనీసం 9 మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారని సైనికాధికారులు తెలిపారు. సులు ప్రావిన్స్ రాజధాని జోలోలోని అత్యంత రద్దీగా ఉన్న ఓ వీధిలో కిరాణా దుకాణం ఎదుట నిలిపిన మిలటరీ ట్రక్ లక్ష్యంగా మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన తొలి పేలుడులో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గంట తరువాత మొదటి పేలుడు ప్రదేశానికి 70 మీటర్ల దూరంలోని క్యాథలిక్ చర్చిలో రెండో పేలుడు జరగ్గా నలుగురు మృతి చెందారు. రెండుచోట్ల గాయపడిన 17 మందిని అధికారులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/