ప్రధాని మోడీ పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

7,000 మంది పోలీసులు, సీసీటీవీ కెమెరాలు.. దారి పొడవునా నిఘా

హైదరాబాద్: ప్రధాని మోడీ నేడు హైదరాబాద్ లో రెండు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్న దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా లోపాలు వెలుగు చూడడం తెలిసిందే. అలాంటివి ఇక్కడ పునరావృతం కాకుండా, అటు ఎస్పీజీ, ఇటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాయి.

సుమారు 7,000 మంది పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని పర్యటన భద్రత కోసం రంగంలోకి దింపింది. ప్రధాని ఎక్కడా రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా ప్రణాళిక రూపొందించారు. ప్రధాని పర్యటించే పటాన్ చెరు (ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు), ముచ్చింతల్ (రామానుజాచార్య విగ్రహావిష్కరణ) చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం పోలీసులు, ఎస్పీజీ అధీనంలోకి వెళ్లిపోయాయి. ముచ్చింతల్ లో 270 సీసీటీవీ కెమెరాలను కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం పర్యవేక్షించనున్నారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్ లో ఇక్రిశాట్ కు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్ కు హెలికాప్టర్ లో చేరుకుంటారు. ప్రధాని భద్రతను చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) అధికారుల బృందం వారం ముందే హైదరాబాద్ చేరుకుంది. సైబరాబాద్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగంలో కలసి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ముచ్చింతల్ వేదిక 3డీ చిత్రాలను కూడా ఎస్పీజీ తీసుకుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రధానిని వేగంగా అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా చిత్రాలు తీసుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/