ఢీకొన్న ప్యాసింజర్ బస్సు, ట్రక్కు..ఏడుగురు మృతి
అయోధ్యః యూపీలోని అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో-గోరఖ్పూర్ జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అయోధ్య నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు అంబేద్కర్నగర్ వైపు వెళ్లడానికి జాతీయ రహదారిపై మలుపుతీసుకుంటున్నది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.