ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి
భువనేశ్వర్ః ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్ నెయూల్పూర్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను దవాఖానకు తరలించారు. మినీ ట్రక్కు కోల్కతా నుంచి వస్తున్నదని చెప్పారు. ఘటనా స్థంలోనే ఆరుగురు మరణించగా, మరొకరు దవాఖానకు తీసుకెళ్తుండగా చనిపోయారని వెల్లడించారు. మృతులంతా పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలకు చెందినవారేనని తెలిపారు. ప్రమాదం ధాటికి మినీ ట్రక్కు ముందుభాగం నుజ్జునుజ్జు అయిందన్నారు.
నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు వాహనాలు కాలిపోయాని, వాటిలో ఒక లారీని రోడ్డు పక్కన ఉంచారని స్థానికులు తెలిపారు. ఆగి ఉన్న లారీకి మినీ ట్రక్కు ఢీకొట్టిందని వెల్లడించారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా దానికి తొలగించకపోవడంతో మరిని యాక్సిడెంట్లు అవుతున్నాయని ఆరోపించారు.