ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి
గువాహటి: అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గువాహటిలోని జలక్బారీ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను విద్యార్థులుగా గుర్తించారు. వారంతా అస్సాం ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారని చెప్పారు.