హార్ట్‌ ఎటాక్‌తో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం

తెలంగాణ లో మరో చిన్నారి గుండె ఆగిపోయింది. రాష్ట్రంలో గుండెపోటు మరణాలు ఆగడం లేదు. వయసు తో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లకు పైబడిన వారికీ ఎక్కువగా గుండెపోటులు వచ్చేవి..కానీ కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటులు వస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుసపెట్టి యువకులు, యువతులు లతో పాటు చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న వారు..ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు.

తాజాగా గుండెపోటుతో 6వ తరగతి విద్యార్థిని హఠాన్మరణం చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో బోడ లకపతి, వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారు. వీరికి ఇద్దరు సంతానం. కూతురు బోడ స్రవంతి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామనవవి పండగ సందర్భంగా సెలవు కావడంతో గురువారం సాయంత్రం వరకు తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంది. అనంతరం నానమ్మ దగ్గర నిద్రించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడింది స్రవంతి. ఆయాస పడుతూనే నానమ్మను లేపింది. ఆపై గుండెపోటుతో కుప్పకూలింది. సమీపంలోనే ఉన్న బాబాయ్‌ వచ్చి సీపీఎర్‌ చేశాడు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ బాలిక కన్నుమూసినట్లు వైద్యుడు తెలిపాడు. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.