తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ఈ మేరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన ఆమె కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.


కాగా, కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూతపడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. ఇక తెలంగాణలో ఇప్పటికే 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మిగతా తరగతులు చదువుకునే విద్యార్థులకు కూడా బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజా 6, 7, 8 తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/