ఆరుగురు టీఎంసీ ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్‌

రూల్ 255తో ఒక రోజంతా సస్పెన్షన్

న్యూఢిల్లీ : ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. బుధవారం సభ ప్రారంభమవగానే పెగాసస్ వివాదంపై తృణమూల్ ఎంపీలు రచ్చ మొదలుపెట్టారు. సభ వెల్ లోకి దూసుకెళ్లి.. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అందరూ వెనక్కు వెళ్లి సీట్లలో కూర్చోవాల్సిందిగా చైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. లేదంటే చైర్మన్ ను, సభను గౌరవించని కారణంగా రూల్ 255 ప్రకారం అందరినీ బయటకు పంపించేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా వారు వెనక్కు తగ్గకపోవడంతో ఆరుగురు ఎంపీలను ఈ రోజంతా సభ నుంచి బహిష్కరించారు.

ఆ తర్వాత పార్లమెంటరీ బులెటిన్ లో బహిష్కరణకు గురైన ఎంపీల వివరాలను వెల్లడించారు. దోలా సేన్, మహ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్ లను ఒక రోజు పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/