నేపాల్లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి
కఠ్మండూః ఈ రోజు తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం దీపయాల్కు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయని, ఆస్తినష్టం సంభవించిందని వెల్లడించారు.
నేపాల్లో గత 24 గంటల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. మంగళవారం రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. మళ్లీ 9.41 గంటల సమయంలో 3.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. కాగా, అర్ధరాత్రి సమయంలో వచ్చిన భూకంపంతో ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని గజియాబాద్, గురుగ్రామ్తోపాటు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కూడా భూమి కంపించింది. దీంతో మంచి నిద్రలో ఉన్న ప్రకంపనలతో భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/