అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం..ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

అమెరికా : అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. టెలికం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిజానికి ఈ సేవలు గతేడాది డిసెంబరు 5 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదు. 3.7-3.98 గిగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో 5జీ సేవల నిర్వహణకు వెరిజాన్, ఏటీ అండ్ టీ సంస్థలు లక్షల కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకోగా, తాజాగా నిన్నటి నుంచి వినియోగదారులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, 5జీ సేవలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విమానయాన సంస్థలు అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్ చేశాయి. ఎయిర్ ఇండియా కూడా తమ విమానాలను రద్దు చేసింది. మొత్తం 14 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. వీటిలో శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లాల్సిన విమానం కూడా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, జపాన్ ఎయిర్‌లైన్స్ వంటి విమానయాన సంస్థలు కూడా సర్వీసులను రద్దు చేశాయి.

విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కారణమే ఉంది. 5జీ సేవల కోసం కేటాయించిన బ్యాండ్ (3.7-3.98 గిగాహెర్జ్).. విమానాల ల్యాండింగులో కీలకమైన రేడియో అల్టీమీటర్లు పనిచేసే బ్యాండ్ (4.2-4.4 గిగాహెర్జ్) ఫ్రీక్వెన్సీలు దగ్గరగా ఉన్నాయి. ఫలితంగా రేడియో అల్టీమీటర్ల పనితీరు దెబ్బతిని ఇంజన్, బ్రేకింగ్ వ్యవస్థలు ల్యాండింగ్ మోడ్‌లోకి మారకుండా నిరోధిస్తాయని అమెరికా ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) హెచ్చరించింది. నిజానికి ఈ కారణంగానే అమెరికాలో 5జీ సేవల ప్రారంభం వాయిదా పడింది. విమానయాన సంస్థల ఆందోళన నేపథ్యంలో స్పందించిన ఏటీ అండ్ టీ, వెరిజాన్.. విమానాశ్రయాల వద్ద సేవలను వాయిదా వేసేందుకు అంగీకరించాయి. కాగా, విమానాలు ల్యాండ్ కావాలంటే విమానాశ్రయాల చుట్టూ కనీసం 2 మైళ్ల వ్యాసంలో 5జీ నెట్‌వర్క్ ఉండకూడదని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/