ఇరాన్ నుండి రానున్న 58 మంది భారతీయులు
కేంద్ర మంత్రి జయశంకర్ ట్వీట్ చేసిన కాసేపటికే ల్యాండ్ అయిన విమానం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కొవిడ్-19) చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇరాన్లోనే ఈనేపథ్యలో ఇరాన్లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను భారత వాయుసేన రక్షించింది. వారి కోసం వెళ్లిన ప్రత్యేక విమానం మరికొద్ది సేపట్లో భారత్లో ల్యాండ్ అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. టెహ్రాన్లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయుల కోసం వెళ్లిన వాయుసేన విమానం సి17 వారిని వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అయిన హిండోన్కు తీసుకురాబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే విమానం హిండోన్లో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, వైద్య సిబ్బందికి జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తొలి విడతగా 58 మందిని అక్కడి నుంచి తరలించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఇరాన్లో ఇప్పటి వరకు 230 మంది కోవిడ్19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మూడువేల మంది ఈ వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. ఒక్క రాజధాని టెహ్రాన్లోనే 1945 కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా, ఇరాన్లోని క్వామ్ నగరంలో ఉన్న మరో 40 మంది భారతీయులకు వైద్యసాయం అందించేందుకు ఢిల్లీ నుంచి వైద్యుల ప్రత్యేక బృందాన్ని భారత్ పంపింది.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/english-news/