నేటి నుంచి బండి సంజయ్​ 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

4th phase of Bandi Sanjay’s padayatra starts from today

హైదరాబాద్ః నేటి నుండి బిజెపిరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి యాత్రను ప్రారంభించనున్నారు. రాంలీలా మైదానంలో.. పాదయాత్ర ప్రారంభ సభను నిర్వహించనున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్​తో పాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్ల మేర బండి సంజయ్​ నడవనున్నారు. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 11 వందల 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మొత్తం 18 జిల్లాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు చేపట్టే యాత్రతో కలిపి.. 8 పార్లమెంట్​ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి అవుతుంది. పాదయాత్రలో భాగంగా ప్రతి రోజు సగటున బండి సంజయ్ 11 కిలోమీటర్ల మేర యాత్రను సాగించనున్నారు.

గతంలో రోజుకు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో బండి ఈ యాత్ర చేపడుతున్నారు. మహా నగరంలో సమస్యలు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలను కలిసి.. వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో బండి సంజయ్ రోజుకు 10 నుంచి 11 కిలోమీటర్లకే కుదించుకున్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విమోచన వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ ఒక్కరోజు యాత్రను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నెల 22న పెద్ద అంబర్​పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. పాదయాత్రను బండి సంజయ్ ముగించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/