అమెరికాలో దారుణం..ఒకే ట్రక్కులో 46 మృతదేహాలు

విపరీతమైన వేడి కారణంగా ఊపిరాడక మరణించి ఉండొచ్చని అనుమానం

46-dead-after-stacks-of-bodies-found-in-truck-in-texas

టెక్సాస్‌: అమెరికా, మెక్సికో సరిహద్దులో జరుగుతున్న మానవ అక్రమ రవాణాకు సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో సోమవారం ఓ ట్రక్కులో 46 మంది వలసదారుల మృతదేహాలును అధికారులు గుర్తించారు. వీరంతా ఊపిరాడక చనిపోయినట్టు భావిస్తున్నారు. ట్రక్కు ట్రెయిలర్‌లో దాక్కున్న మరో 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్టు శాన్ ఆంటోనియో ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నగర శివారులోని మారుమూల ప్రాంతంలో రైల్ రోడ్డు పక్కన ఈ ట్రక్కును గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ స్పందించారు. ‘టెక్సాస్‌లో తీరని విషాదమని’ ట్వీట్ చేశారు. స్థానిక రాయబార కార్యాలయ అధికారులు ఘటనా స్థలానికి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, బాధితుల జాతీయత తెలియాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా అమెరికా-మెక్సికో సరిహద్దు నుంచి వలసలు భారీగా పెరిగాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వలస విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, శాన్ ఆంటోనియాలో సోమవారం రికార్డు స్థాయిలో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీలు) ఉష్ణోగ్రత నమోదైంది. వలసదారుల మరణానికి ఇది కూడా కారణమై ఉంటుందని భావిస్తున్నారు. జులై 2017లో ఇదే నగరంలో పదిమంది వలసదారులు ట్రాక్టర్ ట్రెయిలర్‌లో మరణించిన కనిపించారు. స్మగ్లింగ్‌ల పాలుపంచుకున్న అభియోగాలపై ఈ కేసులో అరెస్ట్ అయిన ట్రాక్టర్ డ్రైవర్ జేమ్స్ మాథ్యూ బ్రాడ్లీ జూనియర్‌కు ఆ తర్వాతి ఏడాది జీవితకాల శిక్ష పడింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/