మహారాష్ట్రలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఒక్క రోజే 4,092 కేసుల నమోదు

ముంబయి: కరోనా మహమ్మారి కేసులు మహారాష్ట్రలో మళ్లీ పెరిగాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 4,092 కరోనా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 40 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు వదిలారు. 1,355 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేసులు తగ్గుతున్న సమయంలో మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది.

మహారాష్ట్రలో తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 20,64,278 కేసులు నమోదయ్యాయి. మొత్తం 51,529 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,965 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 95.7 శాతంగా ఉంది. మరణాల రేటు 2.5 శాతంగా ఉంది.

ముంబయి విషయానికి వస్తే, నిన్న ఒక్క రేజే 645 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,14,076కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 11,419 మరణాలు సంభవించాయి. మరోవైపు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, హింగోళీ నగరాల్లో గత 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/