త్రీడీ పరిజ్ఞానంతో పట్టీని రూపొందించిన శాస్త్రవేత్తలు

అమెరికా శాస్త్రవేత్తల అద్భుతం.. సూది లేకుండానే టీకా!

న్యూయార్క్: త్రీడీ పరిజ్ఞానంతో అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. సూది లేకుండానే టీకా వేసే సరికొత్త మార్గాన్ని కనిపెట్టారు. ఓ చిన్నపాటి పట్టీని అభివృద్ధి చేసి దాని ద్వారా టీకాను శరీరంలోకి పంపే విధానాన్ని ఆవిష్కరించారు. త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో ఈ పట్టీని రూపొందించిన శాస్త్రవేత్తలు.. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే టీకా కంటే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. నిజానికి టీకా ఏదైనా రోగ నిరోధక కణాలపైనే పనిచేస్తుంది. తాజాగా అభివృద్ధి చేసిన పట్టీని చేతికి అతికించడం ద్వారా అది నేరుగా ఈ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుందని, ఫలితంగా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే టీకా కంటే ఇది 10 రెట్లు సమర్థంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టి-కణ స్పందనను 50 రెట్లు ఎక్కువగా కలిగిస్తుందని కూడా గుర్తించారు. పాలిమర్ పట్టీపై త్రీడీ ముద్రిత సూక్ష్మ సూదులను అమర్చడం ద్వారా ఈ పట్టీని రూపొందించారు. మీజిల్స్, ఫ్లూ, హెపటైటిస్, కొవిడ్-19 టీకాలు ఇచ్చేందుకు అనుగుణంగా ఈ పట్టీల్లోని సూక్ష్మ సూదుల్లో మార్పులు చేసుకోవచ్చని పరిశోధన బృందానికి నేతృత్వ వహించిన జోసెఫ్ డి సైమోన్ తెలిపారు. ఈ పట్టీకి అమర్చిన సూక్ష్మ సూదులు చర్మంలో కరిగిపోతాయని, ఎవరికి వారే దీని ద్వారా టీకాలు వేసుకోవచ్చని వివరించారు.

.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/