దేశంలో కొత్తగా 3,016 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య ఈరోజు అమాంతంగా పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 3,016 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..దాదాపు ఆరు నెలల తరువాత ఈ స్థాయిలో కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. మంగళవారం రోజువారి కేసుల సంఖ్య 2,151గా నమోదైంది.

తాజా లెక్కల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,509. ఇక రకవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతం. ఇక కేరళలో కరోనా కారణంగా గత 24 గంటల్లో కొత్త 8 మంది మరణించారు. దేశంవ్యాప్తంగా కొత్తగా 14 మంది మరణించినట్టు కేంద్రం ప్రకటించింది.

బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు వెలుగు చూడడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ భరద్వాజ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులు పాల్గొంటారు.