ట్రాఫిక్ చలాన్ల వల్ల తెలంగాణ సర్కార్ కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో వాహనదారుల పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ల ఆఫర్ గడువు నిన్నటి తో ముగిసింది. ముందుగా గత నెలాఖరు వరకే ఈ ఆఫర్ ఉండగా.. ఆ తర్వాత ఈ నెల 15 వరకు దాన్ని పొడిగించారు. మొత్తం 46 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆఫర్ తో రూ.300 కోట్లకు పైగా వసూలు అయ్యినట్లు అధికారులు చెపుతున్నారు. సుమారు 2.92 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయట. మరో 30 శాతం చలాన్లు పెండింగ్‌‌లో ఉన్నట్లు తెలిపారు. శనివారం నుంచి ఈ–చలాన్‌‌ సైట్‌‌ అప్‌‌డేట్‌‌ కానుంది. ఆఫర్‌‌ ట్యాగ్‌‌లైన్‌‌ తీసేసి ఫుల్‌‌ ఫైన్ అమౌంట్‌‌ను అప్‌‌డేట్‌‌ చేయనున్నారు.

2018 నుంచి గతేడాది వరకు మొత్తం 6.18 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌‌లో ఉండేవి. వీటికి సంబంధించి రూ.1,550 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీంతో పాటు ఈ ఏడాది కూడా చలాన్లు భారీగా పెరిగిపోయాయి. వీటిని తగ్గించేందుకు‌‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బైక్స్, ఆటోలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌‌కు 50 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం డిస్కౌంట్‌‌ ఇచ్చారు. మొదట్లో మార్చి 31 వరకు లాస్ట్‌‌ డేట్‌‌ పెట్టారు. వాహనదారుల నుంచి విశేష స్పందన రావడంతో మరో 15 రోజుల పాటు ఆఫర్‌‌‌‌ పొడిగించారు. ఇలా వసూలైన డబ్బులో రూ.30 కోట్లను ట్రాఫిక్‌‌ వింగ్‌‌కు, మిగతా డబ్బు సర్కార్‌‌ ‌‌గల్లాకి చేరింది. ట్రాఫిక్ పోలీసులు బ్రీత్‌‌ ఎనలైజర్స్, డిజిటల్‌‌ కెమెరాలు, ట్యాబ్స్‌‌ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.