ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి
కరాచీ : పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్స్లో ముజఫ్పర్గఢ్లోని డేరా ఘాజీ ఖాన్ వద్ద ఇండస్ హైవేపై ప్రైవేట్ బస్సు-కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూర్లకు ప్రయాణమైన కార్మికులు సియాల్కోట్ నుంచి రజన్పూర్ కు ప్రైవేట్ బస్సులో ప్రయాణమయ్యారు.
మరో గంటన్నరలో ఇంటికి చేరుతారనగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వీరంతంగా సియాల్కోట్లో దినసరి కార్మికులుగా పనిచేస్తున్నారు. బక్రీద్ను ఇంటి వద్ద జరుపుకునేందుకు బయల్దేరగా ఈ ప్రమాదానికి గురయ్యారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని పోలీసులు బయటకు తీసి దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని డేరా ఘాజీ ఖాన్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/