భారీ పేలుడు.. ముగ్గురు మృతి

బెంగ‌ళూరులో వీవీ పురం పోలీస్ స్టేష‌ను ప‌రిధిలో ఘ‌ట‌న‌

బెంగళూరు: బెంగ‌ళూరులోని వీవీ పురం పోలీస్ స్టేష‌ను ప‌రిధిలోని చామ‌రాజ‌పేట‌లోని ఓ భ‌వనంలో పేలుడు సంభ‌వించి ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి ఆ మృత‌దేహాలు తునాతున‌క‌ల‌య్యాయి. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో మరికొంద‌రికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, ఇత‌ర స‌హాయ‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని గాయ‌ప‌డ్డ వారిని విక్టోరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. భ‌వ‌నంలో పేలుడు ఎందుకు సంభ‌వించింద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. అయితే, పంక్చ‌ర్ షాప్‌లోని కంప్రెస‌రే పేలుడుకు కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పంక్చ‌ర్ షాప్ య‌జ‌మాని అస్లాం కూడా అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడుకి భ‌య‌పడిపోయిన స్థానికులు అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు.

కాగా, పేలుడు దాటికి మృతదేహాలు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని స్థానికులు తెలిపారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ సంజీవ్‌ పటేల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఓ గోడౌన్‌ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/