2జీ టెక్నాలజీని రద్దు చేయాలి ..5జీ వచ్చేస్తుంది

ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వాడుతున్నారు..ముకేశ్‌

Mukesh Ambani

న్యూఢిల్లీ: దేశంలో 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్ ముఖేశ్‌ అంబానీ అన్నారు. భారత్‌ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తుంటే, మరోవైపు, దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలకు దూరంగానే ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో తొలి మొబైల్‌కాల్‌ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ సమావేశంలో ముకేశ్‌ మాట్లాడుతూ.. 1995లో దేశంలో మొబైల్‌ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని చెప్పారు.

అప్పట్లో కాల్‌ చేసినవారు నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని అలాగే కాల్‌ రిసీవ్ చేసుకున్న వారు నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు 4జీ కాల్స్‌ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు. మొబైల్‌లోనే వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు కూడా సామాన్యులకు అందుతున్నాయని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని, అలాగే చాలా మంది సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగానే జరుపుతున్నారని ముఖేశ్ గుర్తు చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/