ప్రమాదానికి ముందే తీగలు తెగిపోయి ఉండొచ్చు..మోర్బీ బ్రిడ్జ్‌ కూలిన ఘటనపై సిట్ నివేదిక

ప్రధాన భాగాలకు తప్పుపట్టిందని వెల్లడి

22-wires-were-already-broken-before-morbi-bridge-snapped

గాంధీనగర్ః గత సంవత్సరం గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలడానికి కారణాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వంతెనను నిలిపిఉంచే ఓ కేబుల్‌లో సగానికి పైగా ఇనుప వైర్లు తప్పుపట్టిపోయాయని నివేదికలో పేర్కొంది. వంతెనపై పాత సస్పెండర్లను కొత్త వాటితో కలుపుతూ చేసిన వెల్డింగ్‌కు కూడా తుప్పపట్టిందని పేర్కొంది. ప్రమాదానికి దారి తీసిన కారణాల్లో ఇవి ప్రధానమైనవని పేర్కొంది. వంతెన ప్రధాన కేబుళ్లు.. ఏడు ఉప తీగలు, అందులో ప్రతి తీగ మళ్లీ ఏడు ఉక్కువైర్లను కలిగి ఉన్నాయి. ఇలా మొత్తం 49 వైర్లతో కేబుల్‌ను రూపొందించారు. అయితే, కేబుల్‌లోని 22 వైర్లు అప్పటికే తుప్పు పట్టి ఉన్నాయి. ప్రమాదానికి ముందే అవి తెగిపోయి ఉండొచ్చు. మిగిలిన 27 వైర్లు ప్రమాద సమయంలో ధ్వంసమయ్యాయి. అలాగే వంతెన పునరుద్ధరణలో భాగంగా పాత సస్పెండర్లను కొత్త వాటితో వెల్డింగ్‌ చేశారు. ఇదీ ప్రమాదానికి ఓ కారణమే. ఈ రకమైన వంతెనల్లో ఒకటే సస్పెండర్‌ను వినియోగించాలి’ అని సిట్‌ తన నివేదికలో పేర్కొంది.

కాగా, మోర్బీలోని మచ్ఛు నదిపై నిర్మించిన ఈ తీగల వంతెన గతేడాది అక్టోబర్ 30న కూలిపోయిన విషయం తెలిసిందే. బ్రిటీష్ కాలంనాటి వంతెన మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ఒరెవా గ్రూప్ చేపట్టింది. ఇందులో చాలా లోపాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒరెవా గ్రూప్ ఎండీతో సహా మొత్తం పది మందిని అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.