అమెరికాలో భారత సంతతి విద్యార్థిని మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్లోని చెరువులో లభించింది. ఆన్రోస్ జెర్రీ అనే యువతి జనవరి 21వ తేదీ నుంచి కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. కేరళకు చెందిన జెర్రీ బ్లెయిన్ హైస్కూల్లో చదువుకుని సైన్స్, బిజినెస్లో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. పియానోతోపాటు ఫ్లూట్ వాయించడంలో నిష్ణాతురాలైన జెర్రీ యూనివర్సిటీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత దంత వైద్యం కోర్సు చదవాలని ఆమె ఆశించినట్లు అధికారులు తెలిపారు. ఆమె శరీరంపైన ఎటువంటి గాయాలు లేవని, ప్రమాదవశాత్తు చెరువులో పడి ఆమె మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/