20 దేశాలకు కోటీ 62 లక్షలకు పైగా డోసుల ఎగుమతి

భారత్​ ఉదారత.. విదేశాలకు ఉచితంగా 62 లక్షల కరోనా టీకా డోసులు

న్యూఢిల్లీ: భారత్‌ మరోసారి పెద్దన్న మనసు చాటుతోంది. ఆపదలో ఆపన్నహస్తాన్ని అందిస్తోంది. ఇప్పటిదాకా 20 దేశాలకు కోటీ 62 లక్షలకుపైగా కరోనా టీకా డోసులను అందించింది. అందులో 62.7 లక్షల డోసులను ఉచితంగా అందించి ఉదారతను చాటింది. అంటే మొత్తం వ్యాక్సిన్లలో 37 శాతం వరకు ఉచితంగా పంపించి.. ఖవ్యాక్సిన్ మైత్రిగకి తెరదీసిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది.

ఈ వివరాలన్నింటినీ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫ్రీగా ఇవ్వడమే కాకుండా.. పలు డోసుల ద్వారా ఆదాయాన్నీ సమకూర్చుకుంటోంది. యూఏఈ, కువైట్, దక్షిణాఫ్రికా, అల్జీరియా, ఈజిప్ట్, మొరాకో, బ్రెజల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు కొన్ని డోసులను విక్రయించింది. జనవరి 25 నుంచి ఈ నెల 2 వరకు ఆయా దేశాలకు కోటీకి పైగా వ్యాక్సిన్ డోసులను భారత్ అమ్మింది. అన్నింట్లోకి బంగ్లాదేశ్ ఎక్కువగా 50 లక్షల డోసులను కొనుగోలు చేసింది. ఆ దేశానికే అత్యధికంగా 20 లక్షల ఫ్రీ డోసులు వెళ్లాయి.

దేశ అవసరాలపై అన్ని విధాలుగా సమీక్షించుకున్న తర్వాతే విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటికే 7‌0 లక్షల మందికిపైగా వైద్య సిబ్బంది, కరోనా ముందు వరుస యోధులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో 7 వేల మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.

ఫ్రీగా వ్యాక్సిన్ పొందిన దేశాలు.. డోసులు

•బంగ్లాదేశ్ -20 లక్షల డోసులు
•మయన్మార్ – 15 లక్షల డోసులు
•నేపాల్ – 10 లక్షలు
•శ్రీలంక -5 లక్షల డోసులు
•ఆఫ్ఘనిస్థాన్ – 5 లక్షల డోసులు
•భూటాన్ -లక్షన్నర
•మాల్దీవులు – లక్ష
•మారిషస్ – లక్ష డోసులు
•బహ్రెయిన్ – లక్ష
•ఒమన్ – లక్ష
•బార్బడోస్ – లక్ష
•డొమినికా – 70 వేలు
•సీషెల్స్– 50 వేలు

వ్యాక్సిన్ కొనుగోలు చేసిన దేశాలు, డోసులు


•బంగ్లాదేశ్ – 50 లక్షలు
•బ్రెజిల్ – 20 లక్షలు
•మొరాకో -20 లక్షలు
•దక్షిణాఫ్రికా – 10 లక్షలు
•కువైట్ -2 లక్షలు
•యూఏఈ – 2 లక్షలు
•ఈజిప్ట్- 50 వేలు
•అల్జీరియా -50 వేలు


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/