మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో 2 కోట్లు సీజ్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తో పాటు ఆయనకు సంబదించిన వారి ఇళ్లలో , ఆఫీస్ లలో ఉదయం నుండి కూడా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తుంది. సుచిత్రలో త్రిశూల్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఉదయం 50 మంది అధికారులు ఒక్కసారిగా దాడులు చేయడం మొదలుపెట్టారు. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లి లోని ఫామ్ మెడోస్ విల్లాలో సోదాలు చేపట్టారు.
మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మైసమ్మగూడ, మేడ్చల్ లో వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డికి మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఒక యూనివర్శిటీ సహా మొత్తం 38 ఇంజనీరింగ్ కాలేజీలు మల్లారెడ్డికి ఉన్నాయి. మొత్తం 6కు పైగా స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, ఇంకా దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
కాగా, మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మల్లారెడ్డి.. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పదో తరగతి వరకే చదువుకున్న ఆయన కొంతకాలం పాల వ్యాపారం చేశారు. కానీ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టారు. మేడ్చల్.. మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆయనకు మించిన ధనవంతుడు లేడని స్థానికంగానే ఉన్న ప్రచారం. ఇప్పుడు ఐటీ దాడులపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.